బీజేపీ పాలిత కర్ణాటకలో ఘటన
దాడి అనంతరం ‘మోదీ మోదీ’ అని
గట్టిగా నినాదాలు చేసిన దుండగులు
బీజేపీ కుట్ర వల్లే నాపై దాడి: టికాయిత్
దాడిని ఖండించిన మంత్రి నిరంజన్రెడ్డి
బెంగళూరు, మే 30: రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్పై కొందరు దుండగులు సోమవారం నలుపు రంగు సిరాతో దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తలపాగా, ముఖం, కుర్తా, ఆకుపచ్చ తువ్వాల మీద సిరా మరకలు పడ్డాయి. సిరా దాడి అనంతరం దుండగులు ‘మోదీ మోదీ’ అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టికాయిత్ మద్దతుదారులు దుండగులను పట్టుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు ప్లాస్టిక్ కుర్చీలతో దాడులకు పాల్పడ్డారు. ఇక్కడి గాంధీభవన్లో ఓ రైతు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. జర్నలిస్టులుగా మారువేషంలో కార్యక్రమానికి వచ్చిన దుండగుల్లో ఒకడు టికాయిత్ ముందు ఉన్న మైక్ను సరిచేసే వంకతో ఆయనపై దాడికి యత్నించాడని, ఇదే సమయంలో మరొకడు సిరా చల్లాడని ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు.
బీజేపీ కుట్ర వల్లే దాడి: టికాయిత్
కర్ణాటకలోని అధికార బీజేపీ సర్కారు కుట్ర, ఉదాసీనత వల్లే తనపై దాడి జరిగిందని టికాయిత్ ఆరోపించారు. ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. దాడి ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. టికాయిత్పై సిరా దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. దాడి అనంతరం టికాయిత్తో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఫోన్లో మాట్లాడారు. దాడిని ఆమ్ఆద్మీ పార్టీ ఖండించింది.
మా వాళ్లేం చేయలేదు
టికాయిత్పై సిరా దాడి అనంతరం దుండగులు ‘మోదీ మోదీ’ అని గట్టిగా నినాదాలు చేయడం సంచలనంగా మారింది. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. టికాయిత్పై బీజేపీ నేతలే దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. దాడిని ఖండిస్తున్నట్టు వెల్లడించారు.
హేయమైన చర్య రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): టికాయిత్పై దాడిని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. కేంద్రం అనాలోచితంగా తెచ్చిన మూడు సాగుచట్టాలపై దేశ రైతాంగాన్ని ఏకం చేసి, 16 నెలల పాటు ఢిల్లీని దిగ్బంధించి ప్రధాని మోదీ చేత క్షమాపణలు చెప్పించటమే కాకుండా ఆ సాగుచట్టాలు రద్దు అయ్యేందుకు తనవంతు పాత్ర పోషించిన టికాయిత్పై దాడి జరగడం దారుణం, దుర్మార్గమన్నారు. దాడికి పాల్పడిన వారు ఎంతటివారైనా, ఎవరైనా సరే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.