నేషనల్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు అధికార బీజేపీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వెనుకబడిన వర్గాలకు చెందిన ముగ్గురు కీలక మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం, ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడుతుండటం, తన సొంత నియోజకవర్గంలోనే డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను స్థానికులు ఘెరావ్ చేయడం వంటి ఘటనలు కమలనాథులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బీజేపీ నేతలు తమ గ్రామాల్లోకి రావొద్దంటూ ప్రజలు బోర్డులు ఏర్పాటుచేయడం కాషాయపార్టీపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేస్తున్నది. అభివృద్ధి పేరిట ఓట్లడిగే పరిస్థితి లేకపోవడంతో ఎప్పటిలాగే బీజేపీ హిందూత్వ, జాతీయవాద ఎజెండాను మళ్లీ ముందుకు నెట్టింది. మత ప్రాతిపదికన ప్రజల్లో చీలిక తెచ్చి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ ఎన్నికలు 80 శాతం మందికి (హిందువులు), 20 శాతం మందికి (ముస్లింలు) మధ్యే పోటీ అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించడం ఇందులో భాగమే. రామమందిర నిర్మాణం, కాశీవిశ్వనాథ్ కారిడార్ నిర్మాణాన్ని ఆ పార్టీ ప్రధాన ప్రచారాస్ర్తాలుగా చేసుకున్నది.
ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలువడం గత రెండున్నర దశాబ్దాల్లో లేదు. ఐదేండ్ల యోగి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. రాష్ట్రంలో నిరుద్యోగం పెచ్చుమీరింది. రైతులు, దళితులు, ఓబీసీలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్కు ఆదరణ పెరుగుతున్నది. కీలక ఓబీసీ నేతలు బీజేపీని వీడి ఎస్పీలో చేరడం ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం. ఈ ఎన్నికల్లో మాయావతి క్రియాశీలకంగా లేకపోవడంతో దళితులు కూడా ఎస్పీ వైపే మొగ్గుచూపుతారన్న అంచనాలున్నాయి. బాబాయ్ శివపాల్యాదవ్ కూడా తిరిగి అఖిలేశ్ చెంతకు చేరడంతో యాదవ ఓట్లు చీలకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ నుంచి ఎదురవుతున్న ‘మండల్’ సవాల్ను ‘కమండల్’తో ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తున్నది.
ఔరంగజేబు వర్సెస్ శివాజీ..
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన, కాశీ విశ్వనాథ్ నడవా ప్రారంభం, దేశంలో ఔరంగజేబు వస్తే శివాజీ కూడా ఉద్భవిస్తాడని ఆ సందర్భంగా వ్యాఖ్యానించడం.. సాలార్ మసూద్ వంటివారు దేశంపై దండెత్తి వస్తే.. రాజా సుహెల్దేవ్ వంటి వీరులు వారికి బుద్ధిచెబుతారని పేర్కొనడం, పొరుగున ఉన్న ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించడం, మథురలో దేవాలయ నిర్మాణం జరుగాలని పిలుపునివ్వడం ప్రణాళికాబద్ధంగా జరిగినవే. హరిద్వార్, ఢిల్లీ ధర్మసంసద్లో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు, వీటిపై ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనాయకత్వం మౌనం వహించడం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.
హజ్ హౌస్ వర్సెస్ మానస్ సరోవర్ భవన్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఎన్నికల ప్రచారాన్ని కైరానా నుంచి ప్రారంభించడం హిందువుల ఓట్లను సంఘటితం చేసే ప్రయత్నంలో భాగమే. ఎస్పీ హయాంలో ముస్లింలు కైరానా నుంచి హిందువులను వెళ్లగొట్టారని బీజేపీ ఆరోపిస్తున్నది. రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలను కూడా అమిత్షా తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో అడుగు ముందుకు వేశారు. ఈ ఎన్నికలు 80 శాతం ఉన్న వారికి, 20 శాతం ఉన్న వారికి మధ్యేనని అభివర్ణించారు. ఈ గణాంకాలు రాష్ట్రంలో హిందూ, ముస్లిం జనాభాను ప్రతిబింబిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఘజియాబాద్లో గత ఎస్పీ ప్రభుత్వం హజ్ హౌస్ నిర్మిస్తే, తమ ప్రభుత్వం మానస సరోవర్ భవన్ను నిర్మించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రచారం మరింత ఊపందుకోనున్న నేపథ్యంలో బీజేపీ నేతల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు మరిన్ని వినాల్సి రావొచ్చని విశ్లేషకులు అంటున్నారు.