న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 లోక్సభ సీట్లు గెలవాలని.. అలా జరిగితే అదే ఆర్టికల్ 370 రద్దు కోసం పోరాడిన పార్టీ సిద్ధాంత కర్త శ్యామ్ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అర్పించినట్టు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ప్రతి బూత్ వర్కర్ పోలింగ్ బూత్పై దృష్టి పెట్టాలని, పార్టీకి కనీసం 370 సీట్లు వచ్చేలా చూడాలని కోరారు. మోదీ ప్రసంగం గురించి బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే విలేకరులకు వివరించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు అనవసరమైన భావోద్వేగ సమస్యలను లేవనెత్తుతాయని చెప్పారు. పార్టీ సభ్యులు మాత్రం దేశాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పేదలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు.
ఫిబ్రవరి 25 నుంచి పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తుందని వెల్లడించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏండ్లు, ప్రధానిగా పదేండ్లు కలిపి.. సుమారు 23 ఏండ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా ఒక్క చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదని తావ్డే చెప్పారు. ఈ కాలమంతా ఆరోప్ ముక్త్, వికాస్ యుక్త్ (ఆరోపణలు లేని వికాసంతో కూడిన) కాలం అని ఆయన అభివర్ణించారు. మోదీ పదేండ్ల పాలనలో ‘రామ రాజ్యం’ కల సాకారమైందని ఈ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు.