తిరువనంతపురం: రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి రెండు అంకెల సీట్లు వస్తాయని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలను, ఆశయాలు నిజం అయ్యేలా చర్యలు తీసుకోవడం తన గ్యారెంటీగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేరళ రాష్ట్రాన్ని తమ పార్టీ ఎన్నడూ ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడలేదని ఆయన తెలిపారు.
2019లో బీజేపీ ఓట్ల శాతం రెండు అంకెలు దాటిందని, ఇక 2024లో బీజేపీ రెండు అంకెల సీట్లను గెలుచుకోబోతోందన్నారు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల టార్గెట్తో పనిచేస్తున్న బీజేపీకి కేరళ కూడా భాగస్వామ్యం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించకున్నా.. కేంద్ర సర్కారు కేరళకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిందన్నారు. సీపీఎం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు.