లక్నో, జనవరి 22: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం లక్నోలో ఆయన మాట్లాడుతూ.. 50 ఏండ్ల పాటు అధికారంలో ఉంటామని చెబుతున్న బీజేపీ ఇప్పుడు రోజులు లెక్క పెట్టుకుంటున్నదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని రెండు మెడికల్ కాలేజీలు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎలా ఉన్నాయో చూస్తే బీజేపీ ఇక్కడ ఎన్ని సీట్లు గెలవబోతున్నదో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అర్థం అవుతుందన్నారు. పోలీస్ కస్టడీలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ ఈ మేరకు తీర్మానం చేయాలన్నారు.