Akhilesh Yadav | ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో రాజకీయంగా సమాధి తప్పదు. గతంలో ఇదే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకీ పడుతుంది. దేశంలో కులగణన చేపట్టాలి. ఈ విషయంలో యూపీఏ-2 హయాంలో కాంగ్రెస్ హామీ ఇచ్చి, ఆ తర్వాత వెనుకడుగు వేసింది. ఇప్పుడు బీజేపీ కూడా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
– అఖిలేశ్ యాదవ్
కోల్కతా, మార్చి 19: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఫ్రంట్కు త్వరలో ఒక రూపం వస్తుందని అన్నారు. ఆ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు బీహార్, పశ్చిమబెంగాల్ సీఎంలు నితీశ్కుమార్, మమతా బెనర్జీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఆదివారం ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో అఖిలేశ్ మాట్లాడుతూ 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చాలా రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఉనికి పెద్దగా లేదని, ప్రాంతీయ పార్టీలే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని పేర్కొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఓడిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించేందుకు పోషించాల్సిన పాత్రపై కాంగ్రెస్ పార్టీనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఓ ప్రశ్నకు అఖిలేశ్ యాదవ్ సమాధానం ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొంటామని చెప్పారు. అదానీ అంశంపై అఖిలేశ్ స్పందిస్తూ.. దేశ ఆస్తులను, ప్రజా ధనాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని విమర్శించారు. అదానీ గ్రూపు అక్రమాలపై హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో ఎల్ఐసీ, ఎస్బీఐలో నష్టపోయిన ప్రజాధనానికి జవాబుదారీతనం ఎందుకు లేదని బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.