తమ తదుపరి టార్గెట్ గుజరాత్ అని సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బుధవారం రోజు ఆమ్ఆద్మీకి చెందిన 3,500 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ వాఘేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తుక్డే తుక్డే గ్యాంగ్కు మద్దతిచ్చే వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ‘మీరెంత మంది అఫ్జల్ గురులకు జన్మనిచ్చినా… వారందర్నీ.. చంపేస్తూనే వుంటాం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ఆద్మీ వెనక దేశ వ్యతిరేక శక్తులున్నాయని ఆరోపించారు. జేఎన్యూ వేదికగా దేశ వ్యతిరేక నినాదాలు చేస్తారని, దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటారని, అలాంటి వారికి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మద్దతిస్తోందని వాఘేలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సత్యాన్ని గ్రహించే.. ఆప్ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన ప్రకటించారు.
కౌంటర్ ఇచ్చిన ఆప్
బీజేపీ నేత ప్రదీప్ సింగ్ వాఘేలా చేసిన వ్యాఖ్యలకు ఆప్ అధికార ప్రతినిధి యోగేశ్ జాద్వాని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు అభివృద్ధి గురించి మాట్లాడరు కానీ.. విభజన రాజకీయాల గురించి మాత్రం జోరుగా మాట్లాడతారని విమర్శించారు. ఆస్పత్రుల నిర్మాణం, పేదలకు మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా వేటినీ ముట్టుకోరని, కేవలం విభజన వాదం గురించే మాట్లాడతారని మండిపడ్డారు. పాకిస్తాన్ పిత జిన్నాను ఆ పార్టీ అగ్రనేత అద్వానీ పొగుడుతారని, మెహబూబా ముఫ్తీతో దోస్తీ చేస్తారనిఆప్ నేత యోగేశ్ ఎద్దేవా చేశారు.