DK Shivakumar | బెంగళూరు, ఏప్రిల్ 19: కర్ణాటకలోని విపక్ష బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కొందరు ఇక్కడ శాంతి భద్రతలు దిగజారాయని, అందుకే గవర్నర్ పాలనను విధించే అవకాశం ఉందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ విషయమై తమ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గవర్నర్ పాలనను విధించడానికి ఆ పార్టీ డ్రామాలు ఆడుతున్నదని మండిపడ్డారు.
వారి ఉద్దేశం ఏమైనా ఇక్కడ మాత్రం అది జరగదని స్పష్టం చేశారు. కాగా, గత 48 గంటల్లో రాష్ట్రంలో జరిగిన పలు నేర ఉదంతాలను బీజేపీ ప్రస్తావించింది. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని విమర్శించింది. దానిపై శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయని, ఆ విషయంలో దేశంలోనే కర్ణాటక ఉత్తమంగా ఉందని పేర్కొన్నారు.