న్యూఢిల్లీ, డిసెంబర్ 3: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సంఖ్య మూడుకు తగ్గింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారం కోల్పోయింది. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీ కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో మాత్రమే అధికారం చేపడుతున్నది.
ఇక మధ్యప్రదేశ్లో అధికారం నిలుపుకోవడంతోపాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ను కూడా బీజేపీ తాజాగా తన ఖాతాలో వేసుకున్నది. దీంతో దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల సంఖ్య 12కు పెరిగింది. ప్రస్తుతం గెలుపొందిన మూడు రాష్ర్టాలతోపాటు ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో ఆ పార్టీ సొంతంగా అధికారంలో ఉన్నది. మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలండ్, సిక్కిం రాష్ర్టాల్లో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వాల్లో ఆ పార్టీ భాగస్వామిగా ఉన్నది.
బీహార్, జార్ఖండ్, తమిళనాడు సంకీర్ణ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్నది. ‘నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఫలితాల తర్వాత, ఉత్తరాదిన ఆప్ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించింది’ అని ఆప్ నాయకుడు జాస్మిన్ షా ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, ఎన్పీపీ, ఆప్.. ఆరు పార్టీలు జాతీయ పార్టీ హోదాను కలిగి ఉన్నాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో కలిపి వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు.