అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి రెబెల్స్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకోవాలని రెబెల్ అభ్యర్ధులను కాషాయ పార్టీ పలుమార్లు హెచ్చరించింది. పార్టీ హెచ్చరికలను ఖాతరు చేయకుండా బరిలో నిలిచిన 12 మంది తిరుగుబాటు అభ్యర్ధులను బీజేపీ సస్పెండ్ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో 12 మంది స్వతంత్ర అభ్యర్ధులుగా రంగంలోకి దిగారు. డిసెంబర్ 5న జరిగే రెండో దశ పోలింగ్లో పార్టీ అధికారిక అభ్యర్ధులపై పోటీకి దిగుతూ వీరంతా స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడినందుకు 12 మంది రెబెల్స్ను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటన జారీ చేశారు.
మాజీ ఎమ్మెల్యేలు దిను పటేల్, ధవళ్సింగ్ జలా, రౌల్, ఖతుభాయ్ పగి, ఎస్ఎం ఖంత్, జేపీ పటేల్, రమేష్ జలా, అమర్షి జలా, రామ్సింగ్ ఠాకూర్, మవ్జి దేశాయ్, లెబ్జి ఠాకూర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. డిసెంబర్ 1, డిసెంబర్ 5న రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.