శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్
ముంబై, ఏప్రిల్ 19: ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ మత ఘర్షణలను ఆయుధంగా వాడుకొంటున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. అందులో భాగంగానే మహారాష్ట్ర సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మత కలహాలను ప్రేరేపిస్తున్నదని ఆరోపించారు. మంగళవారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మత సంబంధ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై ముంబైలో ఇప్పటికే ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.
ఇది బీజేపీ సృష్టించిన సమస్యే. దేశంలోని చాలా నగరాల్లో ఇదే సమస్య ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బతీస్తున్నది. దేశీయ, విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపుతున్నది. ఇలాంటి చర్యలు శ్రామికుల వర్గాలో భయోత్పాతానికి గురి చేస్తున్నాయి’ అని వెల్లడించారు. రాబోయే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవటానికే ఈ సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.