న్యూఢిల్లీ : భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఓటమి తప్పదని, గతంలో నందిగ్రాంలో ఫలితం పునరావృతమవుతుందని బీజేపీ పేర్కొంది. సెప్టెంబర్ 30న జరిగే ఉప ఎన్నికలో మమతా బెనర్జీకి ఘోర పరాజయం ఎదురవుతుందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో భవానీపూర్ నుంచి నందిగ్రాంలో పోటీ చేసిన దీదీ ఆ స్ధానంలో సువేందు అధికారి చేతిలో ఓటమి చవిచూశారని, మళ్లీ ఇప్పుడు భవానీపూర్లో ఎలా గెలుస్తానని ఆమె ఆశపడుతున్నారని ఆ ట్వీట్లో మాలవీయ ప్రశ్నించారు. నందిగ్రాంలో ఫలితమే భవానీపూర్లోనూ ఇప్పుడు ఆమెకు ఎదురవుతుందని ఆయన స్పష్టం చేశారు.
భవానీపూర్ స్ధానం నుంచి మమతా బెనర్జీ అభ్యర్ధిత్వాన్ని టీఎంసీ ఖరారు చేసిన క్రమంలో బీజేపీ నేత స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నందిగ్రాం నుంచి ఓడిపోవడంతో భవానీపూర్ నుంచి పోటీచేసేందుకు మార్గం సుగమం చేసేలా ఆ స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి సోవేన్దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. బెంగాల్ సీఎంగా కొనసాగాలంటే మమతా బెనర్జీ ప్రస్తుతం భవానీపూర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంది.