లక్నో : యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అఖిలేష్ కు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేదని ఆయన ఏసీ రూమ్ ల నుంచి ట్వీట్లు చేసే ఓ ట్విట్టర్ జీవి అని యూపీ మంత్రి సిద్ధార్ధ నాథ్ సింగ్ ఆరోపించారు. ప్రజల బాధల గురించి ఇలాంటి నేతలు పట్టించుకోరని దుయ్యబట్టారు.
అఖిలేష్ వంటి ఫైవ్ స్టార్ నేతల తీరుతోనే రాజకీయాలు దిగజారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో రాష్ట్ర ప్రజలకు వీరు సేవ చేయాలని హితవు పలికారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు దుష్ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతుంటే సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారని సింగ్ అన్నారు.