ముంబై : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ సేవలను వినియోగించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాషాయ పార్టీ స్పందించింది. త్వరలో కీలక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మహారాష్ట్ర ప్రభుత్వం కండలవీరుడిని టీకా డ్రైవ్లోకి దించుతోందని బీజేపీ ఆరోపించింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో టీకా విముఖతను ఎదుర్కొనేందుకు ప్రజల్లో అవగాహన పెంచడం కోసం సల్మాన్ ఖాన్ను రంగంలోకి దింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయం వెనుక మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని బీజేపీ ప్రశ్నించింది. ఓ మతాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, మహా వికాస్ అఘడి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ప్రతినిధి రాం కదమ్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం హిందువులను వేధిస్తోందని దుయ్యబట్టారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసమే సల్మాన్ ఖాన్ను వ్యాక్సిన్ డ్రైవ్ పేరుతో తెరపైకి తెస్తున్నారా అని ప్రశ్నించారు.