చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ ప్రజలపై రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 50 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రత్యేకంగా సాగు బడ్జెట్ ప్రవేశపెడతామని కాషాయ పార్టీ హామీ ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, వీకే సింగ్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
మత్స్యకారులకు ఏటా రూ 6000 నగదుతో పాటు ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు అందిస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది. ఆలయాల నిర్వహణ బాధ్యతను హిందూ మేథావులు, సన్యాసులకు అప్పగిస్తామని మేనిఫెస్టోలో కాషాయ పార్టీ పొందుపరిచింది. ఇక ఇంటింటికి రేషన్ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. బాలికలకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తామని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలక ఏఐఏడీఎంకేతో జట్టుకట్టిన బీజేపీ 20 స్ధానాల్లో పోటీ చేస్తోంది.