జైపూర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తులో బీజేపీ బిజీబిజీగా ఉంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడబోయే మరో 83 మంది అభ్యర్థుల పేర్లతో ఆ పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. రాజస్థాన్లో ఇప్పటికే 41 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ.. తాజాగా మరో 83 మంది అభ్యర్థుల పేర్లతో మలి జాబితాను వెల్లడించింది.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మరోమారు ఝల్రాపటన్ నియోజకవర్గం నుంచే బరిలో దిగునున్నారు. ఆమె 2003 నుంచి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ సుభాష్చంద్ర పూనియా అంబీర్ నుంచి, రాజస్థాన్ అసెంబ్లీలో బీజేఎల్పీ నాయకుడు రాజేంద్ర రాథోడ్ తారానగర్ నుంచి, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీజేపీలో చేరిన జ్యోతి మిర్దా నాగౌర్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీపడబోతున్నారు.
కాగా, 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్లో బీజేపీ ఇప్పటివరకు 124 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయ్యింది. మరో 76 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్లతోపాటు రాజస్థాన్ ఓట్లను కూడా లెక్కించనున్నారు.