Shantanu thakur | కోల్కతా: ఇటీవల పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అధికారంలోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై కక్ష కట్టినట్టు కనిపిస్తున్నది. మమత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇక ఎంతోకాలం ఆమె పార్టీ అధికారంలో ఉండదంటూ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ శంతన్ ఠాకూర్ ఆదివారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆయన మాట్లాడుతూ ‘మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టడం మాకు చిటికెలో పని’ అంటూ వ్యాఖ్యానించారు. ‘తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలు మించి అధికారంలో ఉండదని నా నమ్మకం’ అని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ రిగ్గింగ్కు పాల్పడకపోతే తాము వేల సీట్లను గెల్చుకుని ఉండేవాళ్లమని అన్నారు.
ఎన్నికల్లో ఓటమితో బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని టీఎంసీ నేతలు పేర్కొన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఎంసీ రాజ్యసభ ఎంపీ శంతన్ సేన్ అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, సువేందు అధికారి, ఇతర నేతలు తమ ప్రభుత్వంపై గతంలోనూ ఇలాంటి హెచ్చరికలు చేసి డెడ్లైన్లు కూడా ప్రకటించారని, కానీ ప్రజాభిమానం ఉన్నంతవరకు తమను మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.