జ్యోతిర్లింగ క్షేత్రం పవిత్రతను మసకబార్చేందుకు బీజేపీ యత్నం
ఎన్నికల రాజకీయాలకు పవిత్ర మాంధాత పర్వతం రూపు మార్పు
ఆది శంకరాచార్య విగ్రహ ప్రతిష్ఠకు కోట్ల ప్రాజెక్టు
వేరేచోటికి తరలించాలన్న విజ్ఞప్తులు బుట్టదాఖలు
హిందువుల మనోభావాలతో శివరాజ్ సర్కార్ చెలగాటం
పుణ్యగిరిని పిక్నిక్ స్పాట్గా మార్చవద్దంటున్న సాధుసంతులు
ప్రాజెక్టుపై స్టే విధించిన మధ్యప్రదేశ్ హైకోర్టు
భోపాల్ : ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ఘటన మరువకముందే.. మధ్యప్రదేశ్లోని మాంధాత పర్వతంపై జగద్గురువులు ఆదిశంకరాచార్యుల విగ్రహం ఏర్పాటు పేరుతో.. పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పిక్నిక్ స్పాట్గా మార్చాలన్న యత్నాన్ని స్థానిక సనాతన ధర్మ గురువులు, ప్రజలు తీవ్రంగా
వ్యతిరేకిస్తున్నారు.
దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఓంకారాకృతిలో సహజసిద్ధంగా మధ్యప్రదేశ్లోని నర్మదా నది సానువుల్లో అలరారుతున్న మాంధాత పర్వతం. శివపురి, మాహిష్మతి అని కూడా దీన్ని పిలుస్తారు. నిత్యం వేలమంది భక్తులు దర్శించుకొనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కొలువుదీరిన ఈ ప్రాంతంలో ఓ భారీ ప్రాజెక్టుకు కమలదళం కార్యాచరణ ప్రారంభించింది. సాక్షాత్తూ పరమశివుడు నడిచిన నేలగా స్థానికులు భావించే ఆ పర్వతాన్ని బుల్డోజర్లతో తవ్వాలనుకొన్నది. ఎన్నో ఔషధ మూలికలకు ఆలవాలంగా ఉన్న వేల వృక్షాలను తెగ నరకడానికి ఉవ్విళ్లూరుతున్నది. ఎందుకో తెలుసా? వచ్చే ఏడాది నవంబర్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు. అందుకే ఈ ప్రాజెక్టును 2023 నాటికి పూర్తిచేయాలనుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఆచార్య శంకర్ సాంస్కృతిక్ ఎక్తా న్యాస్ ట్రస్టుకు ఏకంగా సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
ప్రతిపాదిత శంకరాచార్య ప్రాజెక్టు నమూనా
ఎన్నికల్లో లబ్ధి కోసం..
మధ్యప్రదేశ్లో రెండేండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి దొడ్డిదారిన గద్దెనెక్కిన బీజేపీకి వచ్చే ఏడాది నవంబర్లో జరిగే ఎన్నికలు సవాల్గా మారాయి. అధికారం చేపట్టడమే కానీ.. అభివృద్ధి కార్యాచరణలో దారుణంగా విఫలమైంది. ఇప్పుడు ఎన్నికలు ముంచుకురావడంతో మళ్లీ మతం గుర్తుకు వచ్చింది. హిందూ ఓటుబ్యాంకును గంపగుత్తగా రాబట్టుకోవడానికి మాంధాత పర్వతంపై 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గత ఫిబ్రవరిలో శివరాజ్సింగ్ సర్కారు నిర్ణయించింది. దీంతోపాటు ఓ మ్యూజియం, అంతర్జాతీయ అద్వైత వేదాంత సంత్ మందిరాన్ని కూడా నిర్మించతలపెట్టింది. దీనికోసం ఏకంగా రూ. 2,141 కోట్లను కేటాయించింది. ప్రాజెక్టును ఆగమేఘాలమీద ప్రారంభించేందుకు గత మార్చిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తొలి విడుతగా రూ.700 కోట్లను కేటాయించి విడుదల చేసింది. కానీ, విగ్రహ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం విశిష్టతను, ప్రాముఖ్యతను, భక్తుల మనోభావాలను కమలనాథులు గ్రహించలేకపోయారు. హిందువులకు ఆదిశంకరులు ఎంత పరమ పవిత్ర గురువులో.. మాంధాత పర్వతం అంత పవిత్రమైంది. దీనిపై శివుడు సశరీరంగా నడయాడాడని ప్రతీతి. అందుకే ఈ పర్వతానికి, దాని పవిత్రతకు ఎలాంటి విఘాతం కలుగకుండా, వేరేచోట ఆదిశంకరుల విగ్రహ ప్రతిష్ఠ చేయాలని హిందూ ధార్మికవేత్తలు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టును వేరే ప్రాంతంలో చేపట్టాలని ఇప్పటికే పలు ఎన్జీవోలు 50 వేల మందితో సంతకాలు తీసుకొన్నాయి. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని కోరాయి. ఈ అంశంపై ఎన్జీవో లోక్హిత్ జన్వాదీ సమితి హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న హైకోర్టులోని జబల్పూర్ బెంచ్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటీవల తప్పుబట్టింది. ప్రాజెక్టుపై స్టే విధించింది.
ఓట్ల కోసమే బీజేపీ హిందూ ముసుగు
రాష్ట్రంలోని మూడు జ్యోతిర్లింగాల్లో ఒకటి మాంధాత పర్వతంమీదనే కొలువైంది. వేదాల్లో కూడా ఈ స్థల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. హిందువులకు ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైంది. దీనిపై బుల్డోజర్లతో తవ్వకాలు చేపట్టడం మంచిది కాదు. ఈ చర్యలు హిందువుల మనోభావాలను, మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. తాము హిందూ పక్షపాత పార్టీ అంటూ చెప్పుకొనే బీజేపీ.. కేవలం ఓట్లు దండుకోవడానికే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు అర్థమవుతున్నది.
– మునీందర్ దాస్ కబీర్, మత గురువు, మాంధాత క్షేత్రం
‘ఓం’ స్వరూపమే మారిపోతుంది
విగ్రహాన్ని నిర్మించడానికి పర్వతం పైన ఉన్న దాదాపు 4,000 చెట్లను తెగనరుకనున్నారు. విగ్రహం బేస్ కోసం బుల్డోజర్లతో పవిత్రమైన కొండను తవ్వనున్నారు. ఇదే జరిగితే ‘ఓం’ రూపాన్ని ప్రతిబింబించే మాంధాత ద్వీప పర్వతం స్వరూపమే మారే ప్రమాదమున్నది. హిందూ విశ్వాసాలకు మేం వ్యతిరేకం కాదు. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం హిందూత్వ ప్రచారాన్ని ఎత్తుకునే వారిని మేము సహించబోం. – భారత్ హిత్రాక్ష అభియాన్ అధ్యక్షుడు అభయ్ జైన్
పిక్నిక్ స్పాట్గా మారుస్తారా?
రాజకీయ ప్రయోజనాలకు జ్యోతిర్లింగం కొలువైన ఈ పవిత్ర స్థలాన్ని పిక్నిక్ స్పాట్గా మారుస్తారా? ఇది న్యాయమా?
– ఎన్జీవో లోక్హిత్ జన్వాదీ సమితి న్యాయవాది త్రిపతి