పట్నా : అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీంపై బిహార్లో శుక్రవారం రెండోరోజూ హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మధేపురాలో ఇవాళ మరో బీజేపీ కార్యాలయానికి నిరసనకారులు నిప్పంటించారు. నవాడాలో గురువారం కాషాయ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఆర్మీలో ఉద్యోగావకాశాలు కోరుకునే వారి భవిష్యత్కు భరోసా కల్పిస్తామని, అగ్నిపధ్ స్కీంకు ప్రవేశ వయసును 21 ఏండ్ల నుంచి 23 ఏండ్లక పెంచుతామని ప్రభుత్వం పేర్కొన్నా యూపీ, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు హోరెత్తాయి. నాలుగేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరుల్లో 25 శాతం మందినే ఉంచుతారని, మిగిలిన వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా సాగనంపుతారని అభ్యర్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
నాలుగేండ్ల తర్వాత తమ పరిస్ధితి ఏంటని వారు భవిష్యత్పై రగిలిపోతున్నారు. బిహార్లో విద్యార్ధులు రాళ్ల దాడికి పాల్పడటంతో పాటు వాహనాలకు నిప్పంటించి రైళ్లను దగ్ధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుల్హారియ, సమస్తీపూర్ రైల్వే స్టేషన్లలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించడంతో పాటు విధ్వంసం సృష్టించారు. బెగుసరై రైల్వే స్టేషన్లోనూ నిరసనలు మిన్నంటాయి.