న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు బుధవారం తమ లోక్సభ స్థానాలకు రాజీనామా చేశారు. (BJP MPs resign) ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంట్లోని స్పీకర్ కార్యాలయంలో తమ రాజీనామాలను సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎంపీల్లో 10 మంది బుధవారం ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారని, ఆ తర్వాత లోక్సభకు రాజీనామాలు సమర్పించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. జేపీ నడ్డా వారిని స్పీకర్ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు వెల్లడించాయి.
కాగా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా సమర్పించిన వారిలో కేంద్ర మంత్రులు నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఎంపీలు రితీ పాఠక్, రాకేష్ సింగ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. అలాగే రాజస్థాన్లో పోటీ చేసి విజయం సాధించిన కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, దియా కుమార్, ఛత్తీస్గఢ్ నుంచి గెలిచిన అరుణ్ సావో ఆన్స్ గోమతి సాయి తమ రాజీనామాలు సమర్పించారు.
మరోవైపు రాజ్యసభ ఎంపీగా ఉన్న కిరోరి లాల్ మీనా కూడా రాజ్యసభ ఛైర్మన్కు రాజీనామా సమర్పించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు బాబా బాలక్నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామాలు సమర్పించలేదు. వారు కూడా రాజీనామాలు చేస్తారని సమాచారం.