లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కీలక దశకు చేరిన క్రమంలో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయంక్ శనివారం ఎస్పీలో చేరారు. ఆజంఘఢ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని గోపాల్పూర్లో జరిగిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రచార సభలో మయంక్ ఆ పార్టీలో చేరారు. లక్నో నుంచి బీజేపీ టికెట్ కోసం మయంక్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన ఎస్పీ గూటికి చేరతారని ఫిబ్రవరిలోనే ప్రచారం జరిగింది. తన కుమారుడు పార్టీని వీడతారనే ప్రచారం నిరాధారమని అప్పట్లో ప్రయాగ్రాజ్ ఎంపీ రీటా బహుగుణ జోషి తోసిపుచ్చారు.
బ్రాహ్మణ సామాజికవర్గంలో ప్రాబల్యం కలిగిన రీటా బహుగుణ జోషి కుమారుడు మయంక్ జోషి ఎస్పీలో చేరడం కాషాయ పార్టీకి ఎదురుదెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది విడత పోరు కీలక దశకు చేరింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మెగా రోడ్షోలు, భారీ ర్యాలీలతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన నియోజకవర్గం వారణాసిలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ అంశాన్నీ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశం ముంగిట పలు సవాళ్లు ఎదురైన సందర్భంలో విపక్షాలు వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన భద్రతా దళాలు, ప్రజలు సంక్షోభాన్ని అధిగమించేందుకు పోరాడుతుంటే వాటిని మరింత సంక్లిష్టం చేసేందుకు వారు (ప్రతిపక్షాలు) అన్ని ప్రయత్నాలు చేస్తారని మండిపడ్డారు.
ఇక యూపీలో నిరుద్యోగ సమస్య తీవ్రతను కేవలం సమాజ్వాదీ పార్టీయే లేవనెత్తుతోందని ఆ పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ నిరంతరం పేదలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి కట్టుబడిఉందని స్పష్టం చేశారు. ములాయం సింగ్ యాదవ్ శనివారం జన్పూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేదలపై అణిచివేత, కులం ఆధారంగా వేధింపులు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారుతుంటే, రైతాంగానికి తమ పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు.ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.