బెంగళూరు: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ (Pragya Thakur) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిదువులు కత్తులకు పదును పెట్టాలంటూ రెచ్చగొట్టేలా మాట్టారు. దీంతో మధ్యప్రదేశ్లోని భోపాల్ ఎంపీపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఎంపీ సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ ఇటీవల కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన హిందూ జాగరణ్ వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమపై దాడి చేసే వారిపై స్పందించే హక్కు హిందువులకు ఉందని, పదునైన కత్తులను వారి ఇండ్లలో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. మీ కూతుళ్లను రక్షించుకోండి. ఇంట్లో ఆయుధాలు ఉంచండి. కూరగాయలు కోసే కత్తికి పదును పెట్టండంటూ వ్యాఖ్యానించారు.
వారికి జిహాద్ తెలుసు. వారు లవ్ చేసినా అందులో జిహాద్ చేస్తారంటూ ముస్లింలను ఉద్దేశించి అన్నారు. మనం (హిందువులు) కూడా ప్రేమిస్తాం. దేవుడిని ప్రేమిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిందంటూ.. సాధ్వీపై శివమొగ్గ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సుందరేశ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఐపీసీ 153ఏ, 153బీ, 268, 259ఏ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.