Kangana Ranaut : తనపై దాడులకు ఈడీ సిద్ధమవుతున్నదని, లోక్సభలో తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపధ్యంలో విపక్షాలు ఆయనకు బాసటగా నిలిచాయి. తాము రాహుల్ వెన్నంటి నిలుస్తామని సంఘీభావం ప్రకటించాయి. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు అర్ధరహితమని ఆమె పేర్కొన్నారు.
రాహుల్ గురించి ఏం చెప్పగలం..ఆయన అర్ధం పర్ధం లేని మాటలపై ఏం మాట్లాడతం..నాకైతే ఆయన ఏమన్నారో అర్దం కాలేదని కంగనా వ్యాఖ్యానించారు. దేశం గురించి రాహుల్ మాట్లాడిన మాటలు సరైనవి కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు తాము లాభపడేందుకు దేశాన్ని ముక్కలుగా విభజిస్తారని, వారి మనస్తత్వం అదేనని అనురాగ్ ఠాకూర్ చెప్పిన మాటలను కంగనా రనౌత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ హయాం నుంచే ఇలా జరుగుతున్నదని ఆమె ఆరోపించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్రం విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఉసిగొల్పి దాడులు చేయిస్తోందని, ఈ బెదిరింపులకు రాహుల్ గాంధీ భయపడరని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ మోదీ సర్కార్ లక్ష్యంగా చక్రవ్యూహం వ్యాఖ్యలతో విరుచుకుపడిన క్రమంలో రాహుల్పై దాడికి తెగబడాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు.
మోదీ, బీజేపీ ప్రభుత్వం తొలి పదేండ్లలో ఈడీ, సీబీఐ, ఐటీని దుర్వినియోగం చేసి విపక్ష నేతల ప్రతిష్టను మంటగలిపేందుకు ప్రయత్నించడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ప్రజలు బీజేపీని పక్కనపెట్టి మెజారిటీ తగ్గించారని, 303 సీట్ల నుంచి కాషాయ పార్టీ సంఖ్యా బలం 240కి పడిపోయిందని గుర్తుచేశారు. టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. మోదీ సారధ్యంలోని ప్రస్తుత ప్రభుత్వం బలహీనమైనదని, మోదీ బలహీన ప్రధాని అన్నది అందరికీ తెలిసిందేనని తెలిపారు.
Read More :
Wayanad | 300 దాటిన వయనాడ్ మృతులు.. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు