Brij Bhushan | న్యూఢిల్లీ, మే 1: జంతర్మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అవమానిస్తూ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఫెడరేషన్లో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణల్ని ఖండించే ప్రయత్నంలో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘వెయ్యిమంది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించానని కొంతమంది ఆరోపించారు.
అంతకంటే ముందు వంద మందిపై తాను లైంగిక వేధింపులకు పాల్పడ్డానని అన్నారు. నేనేమైనా శిలాజిత్తో( శారీరక పటుత్వాన్ని పెంచే లేహ్యం) చేసిన రోటీలు తిన్నానా ఏంది?’ అంటూ వెటకారం, వ్యంగ్యంతో కూడిన సమాధానమిచ్చారు. అంతమందితో లైంగిక వాంఛను తీర్చుకునే లైంగిక పటుత్వం తనలో ఉన్నదా? అనే భావం వచ్చేట్టు మాట్లాడారు. బ్రిజ్ భూషణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యవహరశైలిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మరోవైపు, రెజ్లర్ల నిరసన కేవలం రాజకీయ ప్రేరేపితం తప్ప, వారు చేస్తున్న ఆరోపణలకు ఆధారాల్లేవని, నన్ను ఉరితీసినా సరే జాతీయ పోటీలు, ఆటగాళ్ల క్యాంపులు నిలిచిపోవడానికి వీల్లేదంటూ బ్రిజ్ వ్యాఖ్యానించారు.
నిరసనకు దిగిన రెజ్లర్లకు పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతరులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు నవ్జ్యోత్సింగ్ సిద్ధూ సోమవారం రెజ్లర్లను కలి సి మాట్లాడారు. మహిళా రెజ్లర్ల పోరాటానికి అండగా ఉంటానని చెప్పారు. బ్రిజ్ భూషణ్ను అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయటంలో ఎందుకు ఇంత ఆలస్యమైందని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు.