బెంగళూర్ : తనకు సీఎం పదవిని ఆఫర్ చేసినా కాంగ్రెస్ పార్టీలో చేరనని కర్నాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జర్కిహోలి తేల్చిచెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగుతానని ఆయన శుక్రవారం వెల్లడించారు. తనకు తిరిగి మంత్రి పదవి చేపట్టాలనే ఆసక్తి లేదని, దేవేంద్ర ఫడ్నవీస్ తనకు గాడ్ఫాదర్ వంటి వారని, అందుకే ఆయనను కలిశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో 20 ఏండ్ల పాటు తానున్నా దక్కని గౌరవం బీజేపీ, ఆరెస్సెస్లు తనకు ఇచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ మునిగే నావని, అందులో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెబుతూ కొంత కాలం విరామం తీసుకున్న తర్వాత సీనియర్లతో చర్చించిన మీదట భవిష్యత్లో ఏం చేయాలనేది ఆలోచిస్తానని చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకోవడం ఖాయమైనా ఇప్పటికిప్పుడు అలాంటి నిర్ణయం ఉండబోదని తెలిపారు. కాగా రమేష్ జర్కిహోలి సారథ్యంలో 2019లో కాంగ్రెస్-జేడీఎస్ సారథ్యంలోని కర్నాటక ప్రభుత్వం కూలిపోయింది.