Gujarat | అహ్మదాబాద్, మే 28: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కల్తీ ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోంది. డబ్బు కోసం గడ్డి తినే కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న కల్తీపై సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రికి లేఖ రాయడం చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘కల్తీ ఆహారాన్ని తయారు చేస్తున్న, వాటిని అమ్ముతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిపై 304 సెక్షన్ కింద హత్యకు సమానం కాని నేరపూరిత నర హత్య కింద కేసు నమోదు చేయాలి’ అని ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్కు రాసిన లేఖలో సూరత్లోని వరచ్చా రోడ్ ఎమ్మెల్యే కిశోర్ ఖనాని కోరారు.
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో వేల కిలోల కల్తీ ఆహారం పట్టుబడటాన్ని ఆయన లేఖలో గుర్తు చేశారు. పన్నీర్, బ్రెడ్, వంట నూనె, కారం, నెయ్యి, వెన్న, పప్పులు ఇలా ఒకటి రెండు కాదు ప్రతి ఆహార పదార్థాన్ని కల్తీ చేస్తున్నారని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిన కిశోర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కల్తీ నేరగాళ్లకు చిన్న చిన్న శిక్షలు సరిపోవని, వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కల్తీ జరిగిందన్న అనుమానంతో అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకుంటున్న ఆహార పదార్థాలను పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నారని, వాటి ఫలితం రావడానికి సమయం పడుతున్నదని, ఈలోగా కల్తీ ఆహారానికి వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.