హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ విస్తరణలో భాగంగా ఆవరణలోని చారిత్రాత్మక షాహీ మసీదు (బాగ్-ఏ-ఆమ్) స్థలాన్ని తీసుకొనేందుకు సర్కార్ సిద్ధమైనట్టు తెలిసింది. మసీదు స్థలంలో కాన్స్టిట్యూషనల్ క్లబ్ నిర్మించాలనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందుకోసం మసీదుకు చెందిన 1539 చదరపు గజాల స్థలాన్ని స్వా ధీనం చేసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యావనశాఖకు చెందిన 698 చదరపు గజాలు, దాని పక్కనున్న 641 చదరపు గజాల స్థలా న్ని మసీదుకు అప్పగించాలని భావిస్తున్నట్టు వినికిడి. ఇందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధంచేసినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని వక్ఫ్ బాధ్యులు, ముస్లిం మతపెద్దలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిని నయానో భయానో ఒప్పించేందుకు ఒకరిద్దరు ప్రభుత్వ పెద్దలను రంగంలోకి దించినట్టు అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన గెజిట్ ప్రకారం 13,811 చదరపు గజాల మసీదు స్థలం ప్రస్తుతం మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నది. మసీదుకు సంబంధించిన భవనం క్యాటగిరీ-1 వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్నది. ప్రస్తుతం మసీదుకు సంబంధించి 10,117 చదరపు గజాల స్థలం అందుబాటులో ఉన్నదని, మిగిలిన 3500 చదరపు గజాల భూమిని గుర్తించే ప్రక్రియ పెండింగ్లో ఉన్నదని మైనారిటీ సంక్షేమశాఖ అధికారులు చెప్తున్నారు. వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్న స్థలాన్ని సేకరించడం అంత సులభం కాదని పురావస్తు నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఏన్షియంట్ అండ్ హిస్టోరికల్ మాన్యుమెంట్ యాక్ట్ -1960, తెలంగాణ హెరిటేజ్ యాక్ట్-2017 ప్రకారం యాజమాని ఒప్పుకొన్న మీదట మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, లేదంటే అంతే విలువైన స్థలాన్ని సంబంధిత యజమాని సంస్థ లేదా వ్యక్తికి అప్పగించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇలాంటి చట్టపరమైన చిక్కులను అధిగమించాలంటే ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు.
అసెంబ్లీ ఆవరణలోని షాహీ మసీదు స్థలా న్ని తీసుకొని కాన్స్టిట్యూషనల్ క్లబ్ నిర్మించడాన్ని ముస్లిం మైనారిటీ వర్గాలు వ్యతిరేకించే అవకాశం ఉంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని బాహాటంగా వెల్లడించకపోవడంతో వారు స్పందించడంలేదని తెలుస్తున్నది. కానీ ప్రభు త్వం ఇదే రీతిన ముందుకెళ్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని మైనారిటీ సంఘాల బాధ్యులు అంటున్నారు. మసీదు స్థలాన్ని ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లో కుదరదని, అది తమ మనోభావాలను దెబ్బతీయడమేనని స్పష్టం చేస్తున్నారు.