లక్నో, డిసెంబర్ 15: మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్దులార్ గోంద్ను దోషిగా తేల్చుతూ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెలువరించింది. సోన్భాద్రాలోని ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఉల్లాఖాన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యే రామ్దులార్ గోంద్కు 25 ఏండ్ల కఠిన జైలు శిక్ష విధించటమేగాక, రూ.10 లక్షల జరిమానా చెల్లించాలంటూ తీర్పు చెప్పారు. ఈ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రజాప్రాతినిథ్య చట్టం కింద, ఎమ్మెల్యే రామ్దులార్ గోంద్పై అనర్హత వేటు పడనున్నది. దీంతో ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. అంతేగాక అతడిపై మరో 6 సంవత్సరాలపాటు నిషేధం అమలవుతుంది. ఈ కేసులో తన క్లయింట్కు కఠిన శిక్ష విధించవద్దని ఎమ్మెల్యే తరఫు న్యాయవాది జడ్జిని వేడుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో ఆదుకుంటాడని విన్నవించుకున్నాడు. కాగా ఆయన వాదనను జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. మ్యోర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 నవంబర్ 4న లైంగికదాడి ఘటన చోటుచేసుకుంది.