కోల్కతా: పశ్చిమబెంగాల్లో ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు బీజేపీకి షాకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్, విశ్వజిత్ దాస్లు బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా కలియగంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సౌమెన్ రాయ్ కూడా బీజేపీకి బైబై చెప్పి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పార్థ చటర్జీ సమక్షంలో సౌమెన్ రాయ్ టీఎంసీ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీకి హ్యాండిచ్చి టీఎంసీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య సౌమెన్ రాయ్తో కలిపి నాలుగుకు పెరిగింది. అయితే, ఈ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన వారే కావడం గమనార్హం. ఇవాళ టీఎంసీలో చేరిన ఎమ్మెల్యే సౌమెన్ రాయ్.. బెంగాల్ అభివృద్ధితోపాటు, ఉత్తరబెంగాల్ అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.