Akhilesh Yadav | వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాలన్నింటిలోనూ బీజేపీ పరాజయం ఎలా ఉంటుందో రుచి చూస్తుందని వ్యాఖ్యానించారు. `దశాబ్దాల పాటు పాలిస్తాం అని ఆ పార్టీ ప్రకటించుకుంటున్నది. ఆ పార్టీ నేత మరో 50 ఏండ్ల వరకు ఇక్కడ పాలన సాగిస్తాం అని చెబుతున్నారు. కానీ ఇప్పుడు రోజులు లెక్క బెడుతున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలోని రెండు మెడికల్ కాలేజీలను సందర్శిస్తే.. ఉత్తరప్రదేశ్లో ఎన్ని లోక్సభ స్థానాల్లో గెలుస్తారో అర్థం అవుతుంది` అని ఆదివారం అఖిలేశ్ యాదవ్ చెప్పారు.
బీజేపీ నాయకత్వం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించి, పోలీస్ కస్టడీ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తీర్మానం చేయాలని అని అఖిలేశ్ కోరారు. `బీజేపీ వివక్ష పాటిస్తున్నది. బల్వంత్సింగ్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తీర్మానం ఆమోదించగలదా? పోలీస్ కస్టడీలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తీర్మానం ఆమోదించాలి` అని చెప్పారు.
గత నెల 12-13 అర్థరాత్రి కాన్పూర్లో పోలీస్ కస్టడీలో బల్వంత్ సింగ్ అనే వ్యాపారి మృతి చెందాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లోనూ ఛాతీ మీద, ముఖం, తొడలు, కాళ్లు, చేతులు, అరికాళ్లతోపాటు శరీరంపై 24 చోట్ల గాయాలైనట్లు తేలింది.
రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడంలో ప్రభుత్వ వైఫల్యంపై అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. `లండన్, న్యూయార్క్ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నామని వారు ప్రకటించుకుంటారు. ఇప్పుడు జిల్లాల నుంచి ఇన్వెస్ట్మెంట్ తెస్తున్నారు. వారు ఎవరిని ఫూల్స్ను చేస్తున్నారు` అని ప్రశ్నించారు. `పెట్టుబడుల కోసం సొంత ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఇతర రాష్ట్రాల్లో వారు పర్యటిస్తారు. వారు కేవలం ప్రజల్ని మాత్రమే పూల్స్ చేస్తున్నారు` అని అన్నారు.