న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ(BJP) విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాలకు కొత్త సీఎంలను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జనరల్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. సీఎంల ఎంపిక అంశంపై ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్ర నేతలు దాదాపు నాలుగున్నర గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాన్ని తేల్చేందుకు మూడు రాష్ట్రాలకు కేంద్ర నాయకత్వం అబ్జర్వర్లను నియమించే అవకాశాలు ఉన్నాయి.
మధ్యప్రదేశ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ .. ఆ పోస్టు కోసం మరోసారి పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాధిత్య సింథియా, నరేంద్ర సింగ్ తోమర్, కైలాస్ విజయవర్గీయ సీఎం రేసులో ఉన్నారు.
ఇక రాజస్థాన్ కోసం కూడా పలు పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం వసుంధరా రాజేతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్టీ అధ్యక్షుడు సీపీ జోషి రేసులో ఉన్నారు. వీరితో పాటు ప్రముఖ నేతలు దియాకుమారి, మహంత్ బాలక్నాథ్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
చత్తీస్ఘడ్లో మాజీ సీఎం రమణ్ సింగ్ రేసులో ముందంజలో ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ సావో, ప్రతిపక్ష నేత ధరమ్లాల్ కౌషిక్, ఐఏఎస్ ఆఫీసర్ ఓపీ చౌదరీలు కూడా సీఎం రేసులో తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు.