కోల్కతా/పాట్నా/రాయ్పూర్/ముంబై, ఏప్రిల్ 16: నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హలాల్ వంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కమలదళానికి తమ ఓటుతో బుద్ధిచెప్పారు. ఒక లోక్సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటూ గెలువలేకపోయింది. రెండు సిట్టింగ్ స్థానాలను ఎన్డీయే కోల్పోయింది.
బెంగాల్లో భంగపాటు
పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ లోక్సభ, బాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ విజయకేతనం ఎగురవేసింది. అసన్సోల్లో టీఎంసీ నేత శతృఘ్నసిన్హా.. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పౌల్పై 3,03,209 ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో ఈ సీటును బీజేపీ గెలుచుకొన్నది. బాలీగంజ్ అసెంబ్లీ స్థానంలో టీఎంసీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో (49.7% ఓట్లు) ఘన విజయం సాధించారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి కేయ ఘోష్కు 13% ఓట్లే పోలయ్యాయి. దీంతో కమలం పార్టీ మూడో స్థానానికి పరిమితం కాగా సీపీఎం రెండో స్థానంలో ( 30% ఓట్లు)నిలిచింది.
మహారాష్ట్రలో ‘మహా’ ఓటమి
మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ స్థానంలో మహావికాస్ అఘాడీ తరఫున పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి జయశ్రీ జాదవ్.. బీజేపీ అభ్యర్థిపై 19 వేల ఓట్ల పైచిలుకు తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్కు 54% ఓట్లు రాగా, బీజేపీ 43% ఓట్లు వచ్చాయి. మరోవైపు, ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి యశోధ వర్మ గెలుపొందారు. సమీప బీజేపీ అభ్యర్థి కోమల్ జంఘేపై 20,176 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్కు 53 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 41 శాతం ఓట్లు వచ్చాయి.
బీహార్లోనూ పరాజయం
మిత్రపక్షం జేడీయూ అధికారంలో ఉన్న బీహార్లోనూ బీజేపీకి ఓటమి తప్పలేదు. బొచహాన్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీనేత అమర్ పాశ్వాన్ 82,116 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి బేబీ కుమారికి 45,353 ఓట్లే వచ్చాయి. బొచహాన్ స్థానం వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ఖాతాలో ఉండేది. ఎన్నికల ముందు వరకూ ఈ పార్టీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నది.