న్యూఢిల్లీ, జనవరి 4: ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది పార్లమెంట్ సభ్యులను బరిలోకి దింపిన బీజేపీ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ మరో ప్రయోగానికి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. పలువురు రాజ్యసభ సభ్యులను లోక్సభ బరిలోకి దిగి తమ సత్తా చాటుకోవాలని కోరే అవకాశాలున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలువురు కేంద్ర మంత్రులు సహా 21 మంది ఎంపీలను పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించింది.
వీరిలో 12 మంది మాత్రమే గెలుపొందారు. నాయకులైన వారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి ప్రజాతీర్పు పొందాలన్న అంశాన్ని బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులను తమ సత్తా నిరూపించుకోవాలని కోరే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. రాజ్యసభ ఎంపీలుగా ఉన్న కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవీయను ఆయా రాష్ర్టాల నుంచి లోక్సభకు పోటీ చేయించే అవకాశాలున్నట్టు పేర్కొన్నాయి.