Sushil Modi : బిహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బిహార్ సీఎం నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరతారనే ప్రచారం సాగుతుండగా జేడీ(యూ)-బీజేపీ ప్రభుత్వ సారధిగా నితీష్ కుమార్ ఈనెల 28న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపడతారని విశ్వసనీయ సమాచారం.
మూసివేసిన తలుపులు తెరుచుకుంటాయని, రాజకీయాలు అవకాశాల గేమ్ వంటివని సుశీల్ మోదీ వ్యాఖ్యానించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. జేడీయూ, లాలూ సారధ్యంలోని ఆర్జేడీ మధ్య విభేదాలు తీవ్రమైన క్రమంలో బీహార్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం, బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సోషలిస్ట్ దిగ్గజం, మాజీ బిహార్ సీఎం కర్పూరీ ఠాకూర్కు భారత రత్న ప్రకటించడం వంటి పరిణామాలు రాజకీయ స్వరూపాన్ని మార్చేశాయి.
మరోవైపు విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు, ప్రధాని అభ్యర్ధిపై స్పష్టత కరువవడం కూడా నితీష్ కుమార్లో అసంతృప్తికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ నితీష్ను తిరిగి బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి దిశగా పయనించేలా చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Read More :