చెన్నై, జూలై 6: ఒక్కో రాష్ట్రంలో అడ్డగోలుగా.. అడ్డదారిలో.. అధికారాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తున్న బీజేపీ నేతలకు పవర్ మత్తు తలకెక్కిపోయింది. అన్ని రాష్ర్టాల్లోనూ బీజేపీ నేతలు వేలంవెర్రిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడులో బీజేపీ నేత నాయనార్ నాగేంద్రన్ ఏకపక్షంగా విభజనవాదాన్ని తెరపైకి తెచ్చారు. ‘మేం రాష్ర్టాన్ని విభజించలేం అనుకోవద్దు. మాకు అన్ని అధికారాలున్నాయి. మోదీజీ తలచుకుంటే.. తమిళనాడును రెండుగా విడగొట్టేస్తారు. రాష్ట్రంలో 234 సీట్లు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ తమిళనాడుగా విడగొడితే.. 117 సీట్ల చొప్పున రెండు రాష్ర్టాలు ఏర్పడతాయి. మనకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు. వారు బీజేపీ వారైనా.. బీజేపీతో సంకీర్ణంగా ఉన్నవారైనా కావొచ్చు’ అని పేర్కొన్నారు. తమిళనాడుకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని.. ప్రత్యేక దేశం అడిగే పరిస్థితి తీసుకురావద్దని డీఎంకే నేత ఏ రాజా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. ప్రత్యేక దేశాన్ని డీఎంకే నేతలు కోరుకుంటున్నప్పుడు.. తాము ప్రత్యేక రాష్ర్టాన్ని ఎందుకు కోరకూడదని నాయనార్ ఎదురు ప్రశ్నించారు.
నాయనార్ వ్యాఖ్యలను డీఎంకే ఖండించింది. అధికార దాహంతో బీజేపీ మునిగిపోయిందని మండిపడింది. ‘దేన్ని ఆధారంగా చేసుకొని తమిళనాడును విభజిస్తారు’ అని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఎలాంగోవన్ ప్రశ్నించారు. ఒకవేళ తమిళనాడును వాళ్లు (బీజేపీ) రెండు కాదు మూడు భాగాలు చేసినా.. ఆ మూడు రాష్ర్టాల్లోనూ డీఎంకే నేతలే సీఎంలుగా ప్రమాణం చేస్తారని తెలిపారు. కాగా తమిళనాడు విభజనకు సంబంధించి నాయనార్ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కూడా త్వరలో ’ ఓ ఏక్నాథ్ షిండే వస్తాడు’ అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్నాథ్ షిండే తిరుగుబాటును రాజధర్మంగా అన్నామలై అభివర్ణించారు. ‘మహారాష్ట్రలో జరిగింది.. తమిళనాడులో కూడా ఇదే జరుగుతుంది.. దీన్ని మీరు చూస్తారు’ అని బుధవారం పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ త్వరలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నారని, తర్వాత రాష్ట్రంలో కూడా ఏక్నాథ్ షిండే ఆవిర్భవిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత అన్నామలై వ్యాఖ్యలను డీఎంకే పార్టీ లైట్గా తీసుకున్నది. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేదని, తమ పార్టీ సీరియస్గా తీసుకోవడం లేదని సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆర్ఎస్ భారతి పేర్కొన్నారు. అన్నామలై చెత్త మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకేలో తిరుగుబాటు అవకాశం లేదని, స్టాలిన్ డైనమిక్ నాయకత్వంలో రాష్ట్రం సుస్థిరంగా ముందుకు సాగుతున్నదని మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే ఒకరు స్పష్టం చేశారు.