లక్నో : ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. దేశానికి కాబోయే ప్రధాని అఖిలేశ్ యాదవ్ అంటూ లక్నోలోని పార్టీ కార్యాలయం వద్ద భారీ పోస్టర్ వెలిసింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా రాజకీయ వేడిని రగిలించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘కాబోయే ప్రధాని అఖిలేశ్ యాదవ్కు పుట్టిన రోజు శుభాంకాంక్షలు’ అని ఆ పోస్టర్పై ఉన్నది. అయితే వాస్తవానికి అఖిలేశ్ పుట్టిన రోజు జూలై 1. పోస్టర్పై ఎస్పీ నేత రాజేంద్ర స్పందిస్తూ అఖిలేశ్ ప్రధాని కావాలన్నది కార్యకర్తల కోరికని చెప్పారు. బీజేపీ స్పందిస్తూ ‘అది అఖిలేశ్ అనుచరుల కల అయి ఉండొచ్చు. ఇదే సమయంలో ఇండియా కూటమిలోని ఇతర సభ్యులపై ఒత్తిడి పెంచే వ్యూహం కావొచ్చు’ అని పేర్కొంది.