Karnataka | బెంగళూరు: కర్ణాటకలోని కొడగు-మైసూరు లోక్సభ నియోజకవర్గం నుంచి మైసూరు రాజ వంశీకుడిని పోటీ చేయించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ఈ వంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్తో బీజేపీ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఆయన పోటీ చేయడంపై రాజమాత ప్రమోద దేవి వడియార్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది.
ఈ నియోజకవర్గం సీఎం సిద్దరామయ్య ఇలాకా కావడంతో, ఎవరినీ శత్రువులుగా మార్చుకోకుండా జాగ్రత్త వహించాలని ఈ రాజ కుటుంబం కోరుకుంటున్నట్లు కొందరు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ నియోజకవర్గ ప్రస్తుత ఎంపీ, బీజేపీ నేత ప్రతాప్ సింహను ఆ పార్టీ పెద్దలు పక్కనపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి విజిటర్స్ పాస్ను ప్రతాప్ ఇచ్చిన విషయం బయటపడటమే దీనికి కారణమని చెప్తున్నారు.