Lok Sabha Elections | న్యూఢిల్లీ, మార్చి 18: లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలు, ప్రచార వ్యూహాలపై పార్టీలు ఇప్పటికే తలమునకలయ్యాయి. ‘మోదీ గ్యారెంటీలు’ అంటూ బీజేపీ, ‘న్యాయ్ గ్యారెంటీలు’ అంటూ కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి నెలకొన్న పది అంశాలు ఏంటో చూద్దాం..
దక్షిణ రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా యూటీ పుదుచ్చేరిలో మొత్తంగా 129 లోక్సభ సీట్లు ఉన్నాయి. అయితే వీటిలో ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్నవి 29 స్థానాలే. ఈ సారి లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 పైగా సీట్లు(ఎన్డీయే-400) సాధించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. ఈ రాష్ర్టాల్లోనూ గణనీయ సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోనేందుకు పావులు కదుపుతున్నది. ప్రధాని మోదీ దక్షిణాది రాష్ర్టాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు.
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభావం చవిచూసింది. ఫలితంగా రెండు సార్లు వరుసగా 44, 52 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో మొత్తంగా 149 ఎంపీ స్థానాలు ఉండే హిందీ రాష్ర్టాలు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లలో ఒక్కొక్క స్థానం చొప్పున మాత్రమే గెలిచింది. ఇక రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఖాతా కూడా తెరువలేదు. ఈసారైనా కాంగ్రెస్ కరువు తీరుతుందా?.
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో 80కిగానూ వరుసగా 71, 62 ఎంపీ సీట్లు చొప్పున గెలిచింది. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి కొంత ప్రభావం చూపింది. అయితే ఈ సారి ఈ మూడు పార్టీలు మూడు దారుల్లో ఉన్నాయి. దీనికితోడుగా ఈసారి అయోధ్యలో సాకారమైన రామ మందిర నిర్మాణం అంశం ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని, బీజేపీకి కలిసిరావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
బీహార్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ తిరిగి బీజేపీ పంచన చేరింది. గత లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేసి, 40కి 39 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశాయి. మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉద్యోగాల అజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది వర్కౌట్ అయితే బీజేపీ ‘మిషన్ 370’పై ప్రభావం పడొచ్చు.
బెంగాల్లో బీజేపీ బలంపెరుగుతున్నప్పటికీ, అది సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీకి చెక్ పెట్టే అంత స్థాయిలో లేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 18 ఎంపీ స్థానాలు గెలువగా.. టీఎంసీ 22 గెలుచుకొన్నది. ఈసారి సందేశ్ఖాలి ఎపిసోడ్తో పాటు సీఏఏ అమలు తమకు లాభిస్తుందనే ఆశతో కమలం పార్టీ ఉన్నది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు పెద్దయెత్తున రేగిన అస్సాంలోనూ 2021 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి తాము అధిక స్థానాలు గెలుచుకొంటామని బీజేపీ చెబుతున్నది.
పంజాబ్లో ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉన్నది. ఇక్కడ బీజేపీ కేవలం అర్బన్ హిందూ ఓట్ల బేస్తో బలహీనంగా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తన పట్టును కోల్పోయింది. రైతాంగ ఉద్యమం నేపథ్యంలో గ్రామీణ పంజాబ్లోని రైతులు బీజేపీకి మరింత దూరం జరిగారు.
మహారాష్ట్ర రాజకీయాలు గత కొన్నేండ్లుగా చీలిక పేలికలుగా మారాయి. ప్రధాన పార్టీలుగా ఉన్న కీలక నేతల తిరుగుబావుటాతో శివసేన, ఎన్సీపీ పార్టీలు నిలువునా చీలాయి. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల నుంచి చీలి, అసలు పార్టీలుగా గుర్తింపు పొందిన సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గ్రూపులు రెండూ బీజేపీ కూటమిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి పార్టీలు లేదా వ్యక్తుల ఆధారంగా ఓటింగ్ ఉంటుందా? అనేది చూడాల్సి ఉన్నది.
గత ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 10 స్థానాలను గెలుచుకొన్నప్పటికీ, ఆ పార్టీ ఈసారి జాట్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో కమలం పార్టీ.. ఇటీవల సీఎంగా ఖట్టర్ స్థానంలో ఓబీసీ నేతక పగ్గాలు అప్పగించింది. జాట్లు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉండే దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కూడా బీజేపీకి దూరమైంది.
ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరింది. 25కిగానూ ఆరు ఎంపీ సీట్లలో పోటీచేసేలా ఒప్పందం చేసుకొన్నది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, టీడీపీ, జనసేనతో పొత్తు తమకు కొంతైనా కలిసొచ్చే అవకాశం ఉన్నదనే ఆశతో కమలం పార్టీ ఉన్నది.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25 ఎంపీ సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక్క స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి.