(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 17, (నమస్తే తెలంగాణ): విపక్ష పార్టీలో చిచ్చు పెట్టడం.. ఓ గ్రూప్ను చీల్చడం.. వంటి స్వార్థ రాజకీయాలకు బీజేపీ మరోసారి తెరతీస్తున్నది. మహారాష్ట్రలో గత ఏడాది శివసేనని చీల్చి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దించి ఏక్నాథ్షిండేను ఆ సీట్లో కూర్చొబెట్టిన విషయం తెలిసిందే. షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది తిరక్కుండానే ఆయనను కూడా గద్దె దించి ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ను సీఎం సీట్లో కూర్చోబెట్టే దిశగా బీజేపీ వ్యూహరచన చేస్తున్నది. ఎన్సీపీలో చీలిక తెస్తుందంటూ వార్తలు వెలువడుతున్నాయి.
ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హుటాహుటిన శరద్ పవార్ను కలిసి ఆరా తీశారు. శివసేనను ఎలాగైతే చీల్చిందో ఇప్పుడు అదే ప్రయోగంతో తమ పార్టీలో చీలికకు బీజేపీ ప్రయత్నిస్తునట్టు శరద్ పవార్ తనతో చెప్పారని సంజయ్ రౌత్ మీడియాకు వెల్లడించారు. తమ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సుముఖంగా ఉన్నారని శరద్ పవార్ వాపోయినట్టు తెలిపారు. కాగా, అదానీ-మోదీ వ్యవహారంలో విపక్షాల వాదనతో శరద్ పవార్ విభేదించడం బీజేపీ కూటమి వైపు ఆయన అడుగులు పడుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షిండే సీఎంగా కొనసాగితే, మహారాష్ట్రలో ఎంపీ స్థానాలపై ఆశ వదులుకోవాల్సిందేనని బీజేపీ ఆందోళన చెందుతున్నది. సీఎం సీట్లో మరాఠ్వాడా నాయకుడిని కూర్చోబెడితే తప్ప ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోవడం కష్టమేనని ఇటీవల సర్వేలో తేలినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరాఠ్వాడకు చెందిన అజిత్ పవార్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి బీజేపీ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది.
ఈ నెల 8న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు రహస్య భేటీ జరిపినట్టు సమాచారం. అజిత్ పవార్తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. ఎన్సీపీకి సీఎం పదవి ఇస్తే కనీసం 30-35 మంది ఎమ్మెల్యేలు తమ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నట్టు అమిత్ షాకు వారు చెప్పినట్టు సమాచారం. మంత్రివర్గం లో ఎవరెవరు ఉండాలన్నది కూడా అమిత్ షాతో చర్చించిన్నట్టు సమాచారం.