Chidambaram | న్యూఢిల్లీ, జూన్ 28: ఏడాది వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రధాని మోదీ మంగళవారం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చి, రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రధాని మోదీ యూసీసీ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ వేస్తున్న పొలిటికల్ స్టంట్ యూసీసీ అని జేడీయూ నేత కేసీ త్యాగి విమర్శించారు. ఎటువంటి చర్చలు లేకుండా బలవంతంగా యూసీసీని అమలు చేయాలని చూస్తే, అది సామాజిక ఘర్షణకు దారితీస్తుందని, మతస్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ హమీపై విశ్వాసం క్షీణిస్తుందని అభిప్రాయపడ్డారు. యూసీసీని వ్యతిరేకించాలని కేరళలోని మలప్పురంలో జరిగిన సమావేశంలో ఐయూఎంఎల్ నిర్ణయం తీసుకొన్నది. ప్రభుత్వం ఒక అజెండాతో యూసీసీని ప్రజలపై బలవంతంగా రుద్దొద్దని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హితవు పలికారు. దీని ద్వారా ప్రజల మధ్య విస్తృతమైన చీలికలు వస్తాయని హెచ్చరించారు. ప్రస్తుత సమయంలో యూసీసీ సాధ్యమయ్యే విషయం కాదని 21వ లా కమిషన్ ఇచ్చిన నివేదికను చదువుకోవాలని మోదీకి సూచించారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడం ద్వారా మైనారిటీలు, గిరిజనులపై ప్రతికూల ప్రభావం పడుతుందని శిరోమణి ఆకాలీదళ్(ఎస్ఏడీ) పేర్కొన్నది. యూసీసీ వంటి నిర్ణయాలకు తొందరపాటు ఉండకూడదని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ యూసీసీకి సూత్రప్రాయంగా మద్దతు పలికింది. యూసీసీ సైద్ధాంతిక వైఖరికి ఆప్ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత సందీప్ పాఠక్ తెలిపారు. దీన్ని అమలుకు అన్ని పార్టీలు, మతాలతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. అయితే ఇదే సమయంలో బీజేపీపై విమర్శలు చేశారు.
దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని ఉమ్మడి పౌరస్మృతి చెబుతుంది. మతం, ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఉన్న వ్యక్తిగత చట్టాల స్థానంలో మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా అందరికీ వర్తించే చట్టం అమలు చేయాలని సూచిస్తుంది. వివాహాల నుంచి విడాకుల వరకు.. భరణం నుంచి వారసత్వం వరకు వ్యక్తిగత చట్టాల స్థానంలో ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు చేయాలని యూసీసీ చెబుతుంది.