న్యూఢిల్లీ/భావ్నగర్, ఆగస్టు 23: ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని, అయితే ఆ పార్టీ ప్రయత్నాలను విఫలం చేశామని ఆప్ పేర్కొన్నది. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు బీజేపీ రూ.5 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఈ ‘ఆపరేషన్ కమలం’కు సంబంధించిన వీడియో ఆధారం కూడా తన వద్ద ఉన్నదని తెలిపారు. ప్రజలు తిరస్కరించిన ప్రాంతాల్లో అప్రజాస్వామ్యంగా అధికారం చేపట్టేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదని.. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో దీన్ని చూశామని అన్నారు. ఆప్ను చీల్చి బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం చేస్తామని మనీశ్ సిసోడియాకు ఆఫర్ చేయడం ద్వారా ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని దుయ్యబట్టారు.
ఆప్ను చూస్తే బీజేపీకి భయం
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో ఆప్ను చూసి బీజేపీ బాగా భయపడుతున్నదని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో ఆప్ను అడ్డుకొనేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని, ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ను మార్చే ఆలోచనలో ఉన్నట్టు తనకు సమాచారం అందిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన భావ్నగర్లో ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ సిసోడియాను మరో 2-రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉన్నదని అన్నారు. గుజరాత్లో ప్రజలు ఆప్కు పెద్దయెత్తున మద్దతు పలుకుతుండటంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ సిసోడియాకు వ్యతిరేకంగా సీబీఐని ఉసిగొల్పిందని మండిపడ్డారు.
బీజేపీ కుట్ర బయటపెట్టండి..
ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ పన్నిన కుట్రను బహిర్గతం చేయాలని ఎన్సీపీ ఆప్ను కోరింది. ఇందులో భాగంగా సిసోడియాకు బీజేపీ నుంచి వచ్చిన ‘ఆఫర్’కు సంబంధించిన రికార్డింగ్ను బయటపెట్టాలని సూచించింది. ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. మహారాష్ట్రలో కూడా ఇదేవిధంగా ఎమ్మెల్యేలను లోబర్చుకొని, ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చిందని విమర్శించారు.
సిసోడియాపై మనీలాండరింగ్ కేసు
ఢిల్లీ ప్రభుత్వ కొత్త మద్యం విధానం కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ మనీలాండరింగ్ నియంత్రణ చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మరోవైపు, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో సిసోడియాకు అస్సాంలోని కోర్టు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 29లోగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.