న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ (Congress Party)ఆరోపించింది. ఆ అమౌంట్ను వసూల్ చేసేందుకు బీజేపీకి ఐటీశాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. మేం పాల్పడిన ఉల్లంఘనలను సమీక్షించేందుకు ఎటువంటి అంచనాలు చేశారో, అలాగే బీజేపీ ఉల్లంఘనలను తాము కూడా స్టడీ చేసినట్లు ఆయన తెలిపారు. దాని ప్రకారమే బీజేపీ 4600 కోట్ల ఫైన్ కట్టాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 1700 కోట్ల జరిమానా కట్టాలని తాజాగా ఆదాయపన్ను శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. తమకు ఇచ్చిన పన్ను పెనాల్టీ నోటీసుపై మూడు సార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించామని, ఆ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ ఒకటో తేదీన ఉంటుందని మాకెన్ తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన సుప్రీం తన తీర్పులో ఊరట కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు మరో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఐటీ నోటీసులు తమ స్పూర్తిని దెబ్బతీయలేవని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు తమ పార్టీ భయపడదు అని, సత్యం కోసం తాము పోరాడుతూనే ఉంటామన్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కామ్ను వేర్వేరు రూట్లలో చేశారని, ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్, పోస్టు రెయిడ్, షెల్ కంపెనీ గ్రూపుల ద్వారా ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ జరిగిందన్నారు. పన్ను ఉగ్రవాదంతో కాంగ్రెస్ను అటాక్ చేస్తున్నారని ఆరోపించారు.