న్యూఢిల్లీ, మే 19: ఎన్నికల ముందు వరకు పెట్రో ధరలు పెంచబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఎన్నికలు కాగానే బాదుడు మొదలుపెట్టింది. ఐదు రోజులు కూడా గడవక ముందే రెండోసారి పెట్రో ధరలను పెంచింది. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 90 పైసల చొప్పున పెంచింది. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77 నుంచి రూ. 98.64కు పెరగగా డీజిల్ ధర లీటర్కు రూ. 90.67 నుంచి రూ. 91.58కి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత శుక్రవారం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ. 3 చొప్పున ధరలు పెరిగాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, కీలకమైన ప్రపంచ చమురు రవాణా మార్గమైన హొర్ముజ్ జలసంధి ద్వారా రవాణాకు అంతరాయం కలగడంతో ఫిబ్రవరి నెలాఖరు నుంచి ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ వరుస పెరుగుదలలు చోటుచేసుకున్నాయి. ముడి సరుకుల ధరలు పెరిగినప్పటికీ ఇంధన విక్రేతలు పెట్రోల్ పంపు ధరలను పెంచలేదని, ద్రవ్యోల్బణం నుండి వినియోగదారులను కాపాడటమే ఈ చర్య లక్ష్యమని ప్రభుత్వం పేర్కొన్నది.అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు ప్రభుత్వం ధరల సవరణను ఆలస్యం చేసిందని విపక్షాలు ఆరోపించాయి.
ఢిల్లీ, ఎన్సీఆర్లో 3 రోజుల పాటు సమ్మె
కేంద్రం సీఎన్జీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలను నిరసిస్తూ ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లలో టాక్సీ, ఆటో డ్రైవర్లు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. మే 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు సమ్మెను పాటిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఓలా, రాపిడో, ఉబర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్ అగ్రిగేటర్లు తమను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని, మరోవైపు తాము గత 15 ఏండ్లుగా చార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. ఈ మేరకు డ్రైవర్ల ‘చాలక్ శక్తి యూనియన్’ ఢిల్లీ ఎల్జీ గవర్నర్, సీఎం, రవాణామంత్రి, పోలీస్ కమిషనర్కు లేఖ సమర్పించింది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రకటించిన దేశవ్యాప్త నిరసనకు మద్దతుగా ఈ సమ్మెను చేపడుతున్నది. ఇంధన ధరలు విపరీతంగా పెరగటం, వాహనాల నిర్వహణ, బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్స్, పర్మిట్లు, ఇతర ఖర్చులు.. అన్నీ కలిసి తడిసి మోపెడు అవుతున్నాయని, టాక్సీ డ్రైవర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కుటుంబాలను పోషించకోవడానికి తీవ్రంగా పోరాడుతున్నారని యూనియన్ తన లేఖలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆటో-రిక్షా చార్జీలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని డ్రైవర్లు హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో సమావేశం ఏర్పాటుచేయాలని కూడా డ్రైవర్ల యూనియన్ కోరింది.
పెట్రోల్లో 30 శాతం ఇథనాల్
30 శాతం ఇథనాల్తో కలిపిన పెట్రోల్ కోసం కేంద్రం ఇంధన ప్రమాణాలను నోటిఫై చేసింది. గత వారం విడుదలైన ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధన మిశ్రమాల కోసం నిర్దేశాలను నోటిఫై చేసింది. ఇప్పటికే ఈ-20 ఇథనాల్ వ్యవస్థను దేశంలో అమలు చేస్తున్నది. అంటే ఒక లీటర్ పెట్రోల్లో ఇప్పటికే 20 శాతం ఇథనాల్ను కలుపుతున్నారు. ఈ మేరకు కేంద్రం 20 శాతం పెట్రోల్ దిగుమతులు తగ్గించుకున్నట్టే. ఇప్పుడు 30 శాతం ఇథనాల్ ఇంధనం అమలు చేస్తే మరో 10 శాతం చమురు దిగుమతులు తగ్గుతాయి. వాస్తవానికి ఈ20 ఇథనాల్ వ్యవస్థను 2030 నాటికి అమలు చేయాలని కేంద్రం తొలుత భావించినా దానిని ముందుకు జరిపి 2025-26 నుంచే అమలు చేయడం ప్రారంభించారు. ఈ20కి సరిపడా ఇంజిన్లను తయారు చేయకుండా ఆ ఇంధనాన్ని వినియోగించడం వల్ల తమ వాహనాల పని సామర్ధ్యం బాగా క్షీణిస్తున్నదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నా అవన్నీ అపోహలుగా కేంద్రం కొట్టిపారేస్తూ దానిని అమలు చేస్తున్నది.
ఎట్టకేలకు దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఇల్లుకు నిప్పంటకున్న తర్వాత చెరువు తవ్వడం ప్రారంభించినట్టు ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుకూలంగా ఉండేలా వాహన ఇంజిన్లు రూపొందించాలని వాహన తయారీ సంస్థలను మోదీ ప్రభుత్వం తర్వాత తాపీగా ఆదేశించింది. అయితే ప్రస్తుతం 30 శాతం ఇథనాల్కు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ దానిని ఇప్పటికిప్పుడు అమలు చేయదని ఒక అధికారి తెలిపారు. ఈ20 ఇథనాల్..2030 నుంచి అమలు చేస్తామని ప్రకటించి ఐదేండ్ల ముందరే దానిని వాహనదారులపై రుద్దిందని, ఇప్పుడు కూడా అదే చేస్తుందని సామాన్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.