న్యూఢిల్లీ, జనవరి 24: దేశంలో వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకొన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు డేగ కన్ను ఇప్పుడు ఆలిండియా సర్వీసుల అధికారులపై పడింది. ఐఏఎస్(క్యాడర్) రూల్స్కు ప్రతిపాదించిన సవరణలపై రాష్ర్టాలన్నీ భగ్గుమంటున్న సమయంలోనే కేంద్రప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. ఏఐఎస్ల డిప్యుటేషన్ కోసం చేసిన సవరణలే ఐపీఎస్, ఐఎఫ్ఎస్ క్యాడర్లకు కూడా వర్తిస్తాయని తెలిపింది. అందుకు ఐపీఎస్, ఐఎఫ్ఎస్ క్యాడర్ రూల్స్కు కూడా సవరణలు చేసింది. దీనిపై ఈ నెల 17న అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది. అన్ని ఆలిండియా సర్వీసుల్లో ఏకరూపత కోసమే ఈ పని చేశామని లేఖలో పేర్కొన్నది. 28వ తేదీలోగా అన్ని రాష్ర్టాలు అభిప్రాయాలు చెప్పాలని ఆదేశిస్తూ తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపింది. ఈ సవరణ బిల్లులను బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతున్నట్టు సమాచారం.
భగ్గుమంటున్న రాష్ర్టాలు
బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై రాష్ర్టాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ర్టాల అధికారాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్రాన్ని కోరుతున్నాయి. తాజా సవరణలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శిస్తున్నాయి. వివాదాస్పద నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నవాటిలో బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా ఉన్నాయి. ఐఏఎస్ క్యాడర్ రూల్స్కు చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తొమ్మిది రాష్ర్టాల సీఎంలు (బీహార్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు) ప్రధాని మోదీకి లేఖ రాశారు.
రాష్ర్టాల స్వయం ప్రతిపత్తికి దెబ్బ
ఐఏఎస్ల డిప్యుటేషన్పై కేంద్రం చేసిన సవరణలు రాష్ర్టాలకు ఉన్న స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని రాష్ర్టాలు వాదిస్తున్నాయి. ‘రాష్ర్టాల్లో విధానాల రూపకల్పన సహా అనేక కేంద్ర పథకాలను రాష్ట్ర స్థాయిలో అమలు చేయడంలో ఐఏఎస్లే కీలకం. ఐఏఎస్లను బలవంతంగా డిప్యుటేషన్పై పంపాలని కోరడం రాష్ర్టాల్లో పరిపాలన వ్యవహారాలపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది’ అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో సంప్రదింపుల ద్వారానే
ఇప్పటి వరకు ఏదైనా రాష్ట్రం ఐఏఎస్లను డిప్యుటేషన్పై పంపాలంటే ముందుగా అధికారులను అడిగేది. ఆసక్తి చూపుతున్నవారి పేర్లతో జాబితా తయారు చేసి కేంద్రప్రభుత్వానికి ఇచ్చేది. వారిలో నుంచి కేంద్రప్రభుత్వం తమకు అవసరం అయినంత మందిని డిప్యూటేషన్పై తీసుకువెళ్లేది. ఇదంతా సమాఖ్య స్ఫూర్తితో, సంప్రదింపుల ద్వారా జరిగేది. తాజా సవరణలతో ఐఏఎస్, ఐపీఎస్ల ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా తీసుకువెళ్లే అవకాశం ఉన్నది.
కేంద్రం ప్రతిపాదించిన సవరణలు