హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బెడిసికొట్టడంతో బీజేపీ పెద్దలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో జడుసుకున్న బీజేపీ.. రెండు నెలల క్రితం బ్రేకులు వేసిన ‘ఆపరేషన్ జార్ఖండ్’ను మళ్లీ ముందరేసుకున్నట్టు కనిపిస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్లోని హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చివరివరకూ వెళ్లి.. తాత్కాలికంగా ఆ ప్రక్రియకు బ్రేకులు వేసిన కమలదళం, ఇప్పుడు మళ్లీ ఆ చర్యను ముందుకు ఉరికిస్తున్నది. స్టోన్ చిప్స్ మైనింగ్ లీజులో లబ్ధి పొందారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సొరెన్పై అనర్హత వేటు విషయమై ఈసీ గవర్నర్ రమేశ్ బైస్కు రెండు నెలల క్రితమే సీల్డ్ కవర్లో తన నిర్ణయాన్ని పంపించింది. అయితే, ఆ నివేదికపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోని గవర్నర్ తాజాగా స్పందించారు. ‘జార్ఖండ్లో త్వరలో అణుబాంబు పేలొచ్చు’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర మంత్రులు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. ‘ఈసీ సిఫారసు మేరకు ఈపాటికే నిర్ణయం తీసుకొనేవాడిని. అలాకాకుండా రెండో అభిప్రాయం కూడా కోరాను’ అని చెప్పుకొచ్చారు.
రెండో అభిప్రాయమా? అదేం లేదే..
సొరెన్ అనర్హత వేటుపై రెండో అభిప్రాయం కోరినట్టు గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై రాజ్భవన్, ఈసీ అధికారవర్గాలు స్పందించాయి. గవర్నర్ అలాంటి ప్రతిపాదన ఏమీ చేయలేదని కుండబద్దలుకొట్టాయి. ఈసీని గవర్నర్ రెండో అభిప్రాయం కోరే నిబంధనలు చట్టంలో ఏమీ లేవని మాజీ సీఈసీ ఓపీ రావత్ తెలిపారు. కాగా రెండు నెలల క్రితమే ఈసీ నివేదిక సమర్పించినప్పటికీ, సీఎం సొరేన్ శాసనసభ సభ్యత్వంపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ ఎమ్మెల్యేల కొనుగోలును ప్రోత్సహిస్తున్నారని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు.