అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. త్రిపురలోని మజ్లిష్పూర్ నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. రాణిర్బజార్ మోహన్పూర్లో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ అజయ్ కుమార్తోపాటు పలువురు గాయపడ్డారు. అయితే గాయపడిన తమ కార్యకర్తలు రాణిర్బజార్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండడంతో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను ఇంకా ఆసుపత్రికి తరలించలేదని ఆయన విమర్శించారు.
మరోవైపు త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రి ప్రతిపక్షాలపై దాడులకు పురిగొల్పుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో మజ్లిష్పూర్తోపాటు ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలను ప్రత్యేకంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేశారు. కాగా, త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరుగుతుంది. మార్చి 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.