న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా ఆ మూడు రాష్ట్రాల్లో ఇంకా ముఖ్యమంత్రులను ఎంపిక చేయలేదు. ఆయా రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రుల పేర్లు ఇప్పటికీ ఖరారు కాలేదు. ఈ క్రమంలో ఆ మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపిక కోసం బీజేపీ తొమ్మిది మంది పరిశీలకులను నియమించింది.
ఒక్కో కమిటీలో ముగ్గురు పరిశీలకుల చొప్పున మూడు రాష్ట్రాలకు మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ముగ్గురు కేంద్రమంత్రులు కూడా ఉన్నారు. రాజస్థాన్ (Rajasthan) సీఎం ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీలో కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే, రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే సభ్యులుగా ఉన్నారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సీఎం ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీలో హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, పార్టీ సీనియర్ నేతలు డాక్టర్ కే లక్ష్మణ్, ఆశా లక్డా పరిశీలకులుగా ఉన్నారు. కేంద్ర వ్యవసాయ, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్, నేషనల్ జనరల్ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్ ఛత్తీస్గఢ్ (Chhattisgarh) సీఎం ఎంపిక కోసం ఏర్పాటు చేసిన పరిశీలకుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఈ మూడు కమిటీల్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన కమిటీ పరిశీలకులు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగా సీఎం అభ్యర్థులను ఖరారు చేస్తారు. ఈ కమిటీలు ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పరిశీలించి ఫైనల్ చేస్తుంది.