బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల రెండో దఫా సమావేశాల అనంతరం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ‘ఎన్డీఏ (NDA).. ఇండియా (INDIA)ను సవాల్ చేయగలవా..?’, ‘బీజేపీ (BJP).. ఇండియా (INDIA)ను సవాల్ చేయగలవా..?’ అని ప్రశ్నించారు.
బెంగళూరు సమావేశానికి హాజరైన 26 ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూసివ్ అలయెన్స్ (INDIA)’ అని పేరు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మమతాబెనర్జి ఇండియాను సవాల్ చేయగలవా..? అంటూ బీజేపీని, ఎన్డీఏ కూటమిని ప్రశ్నించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ గెలుస్తుంది, బీజేపీ ఓడిపోతుంది అని ఆమె ధీమా వ్యక్తంచేశారు.
ఇక నుంచి ప్రతిపక్ష పార్టీల తరఫున ఏ సభ నిర్వహించాలన్నా, ఏ ప్రచార కార్యక్రమం నిర్వహించాలన్నా అన్నీ ‘ఇండియా’ కూటమి గొడుగు కిందే జరుగుతాయని మమతాబెనర్జి వెల్లడించారు. కాగా, ప్రతిపక్ష పార్టీల మూడో సమావేశం మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. అయితే, ఏ రోజు జరుగుతుంది అనేది త్వరలో వెల్లడి కానుంది.