Kejriwal in Gujarat |గుజరాత్లో 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారు ప్రజల వాణిని వినేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆప్కు ఒక అవకాశం ఇస్తే ఢిల్లీ, పంజాబ్ల మాదిరిగా గుజరాత్ను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఒకవేళ తమ పనితీరు నచ్చకపోతే ఆ తర్వాతీ ఎన్నికల్లో మరొకరిని ఎన్నుకోండని గుజరాతీలకు పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఇస్తే అన్ని పార్టీలను మరిచిపోతారన్నారు.
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన తర్వాత ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కేజ్రీవాల్ దృష్టిని కేంద్రీకరించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి శనివారం గుజరాత్లో పర్యటించారు. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అటుపై తిరంగా యాత్ర పేరిట రోడ్ షో నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్లో కేజ్రీవాల్ పర్యటనకు ప్రాధాన్యం చేకూరింది.
అహ్మదాబాద్లో జరిగిన రోడ్షోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ 25 ఏండ్లుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉన్నా అవినీతి సమసిపోలేదని ఆరోపించారు. నేను ఏ పార్టీని విమర్శించబోను. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించడానికి నేను ఇక్కడికి రాలేదు. గుజరాత్ను గెలుచుకునేందుకు వచ్చాను. గుజరాతీలకు విజయం చేకూర్చేందుకు వచ్చాను. గుజరాత్లో అవినీతికి చరమగీతం పాడతాం అని కేజ్రీవాల్ అన్నారు.