Mallikarjun Kharge : దేశంలోని అధికార బీజేపీ (BJP) పై, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి బహిరంగసభలో ఖర్గే ప్రసంగించారు. దేశంలో బీజేపీ నియంత పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. బీజేపీ, ఆరెస్సెస్ విషం లాంటివని, ఆ విషాన్ని రుచి చూస్తే చచ్చిపోతారని హెచ్చరించారు. అంటే బీజేపీ, ఆరెస్సెస్ల పాలన గురించి తెలిసి కూడా మరోసారి ఓటు వేయవద్దనే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు.
‘దేశంలో బీజేపీ నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యింది. మీరంతా నియంతృత్వం కోరుకుంటున్నారా..? ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారా..?’ అని బహరంగసభకు విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఖర్గే ప్రశ్నించారు. ‘ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారు చేతలెత్తండి’ అని ఖర్గే అనగానే అంతా చేతులెత్తారు. ఆ వెంటనే ఆయన ‘నియంతృత్వాన్ని కోరుకునే వారు తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
అదేవిధంగా బీజేపీ, ఆరెస్సెస్ విషం లాంటివని అన్నారు. ఆ విషాన్ని రుచి చూస్తే చచ్చిపోతారని హెచ్చరించారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ విషం లాంటివి. మీరు ఆ విషాన్ని రుచి చూస్తే చచ్చిపోతారు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. అంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టేనని ఆయన పరోక్ష హెచ్చరిక చేశారు.